మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... అధికారిక ప్రకటన చేసిన కాషాయదళం

  • మునుగోడులో ఎన్నికల కోలాహలం
  • నవంబరు 3న పోలింగ్
  • ప్రకటన విడుదల చేసిన బీజేపీ హైకమాండ్
మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా పార్టీలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తున్నాయి. మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నేడు బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. 

దేశంలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను కూడా బీజేపీ తన ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణలోని మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హర్యానాలోని అదంపూర్ లో భవ్య బిష్ణోయ్, ఉత్తరప్రదేశ్ లోని గొలా గోక్రాంత్ నియోజకవర్గంలో అమన్ గిరి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది. 

కాగా, మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 చివరి తేదీ. నవంబరు 3న పోలింగ్ జరగనుండగా, నవంబరు 6న ఫలితాలు వెల్లడించనున్నారు.

Komatireddy Raj Gopal Reddy
Munugodu
BJP
Telangana

More Telugu News