Congress: భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం.. కర్ణాటకలోని మాండ్యా వద్ద పాదయాత్రలో పాల్గొన్న సోనియగాంధీ

  • నేటి ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన యాత్ర
  • సాయంత్రం ఏడు గంటల వరకు పాదయాత్రలో సోనియా
  • బ్రహ్మదేవరహళ్లి మీటింగులో పాల్గొననున్న కాంగ్రెస్ అధినేత్రి
  • కర్ణాటకలో 21 రోజులపాటు సాగనున్నయాత్ర
Bharat Jodo Yatra resumes Sonia Gandhi join foot march in Karnatakas Mandya

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో’ యాత్రలో సోనియాగాంధీ నేడు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్ణాటకలో సాగుతోంది. యాత్రలో పాల్గొనేందుకు జకన్న హళ్లి చేరుకున్న సోనియా.. మాండ్యా జిల్లాలోని పాండపుర తాలూకా నుంచి ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన యాత్రలో పాలుపంచుకున్నారు. సాయంత్రం ఏడు గంటలకు నాగమంగళ తాలూకాలో యాత్ర ముగుస్తుంది. అనంతరం బ్రహ్మదేవరహళ్లి మీటింగులో సోనియా పాల్గొంటారు. 

సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర గత శుక్రవారం కర్ణాటకలోకి ఎంటరైంది. కేరళ సరిహద్దులోని చామరాజ్‌నగర్‌లోని గుండులుపేటలో అడుగుపెట్టడం ద్వారా రాహుల్ కర్ణాటకలో కాలుమోపారు. నేటి యాత్రకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ‘ఆశ, ప్రేమ, విజయాల ప్రయాణమిది. భారత్ జోడో యాత్ర స్ఫూర్తి ఇదే’ అని పేర్కొంది. 

పాండవపుర తాలూకా వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నేడు నాగమంగళ తాలూకా వద్ద ముగుస్తుంది. ఇక్కడి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా ఉన్న మడకె హోసూరు గేట్ వద్ద రాత్రి బస చేస్తారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలో 21 రోజులపాటు 511 కిలోమీటర్ల మేర సాగుతుంది. చామరాజనగర్, మైసూరు, మాండ్యా, టుముకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూర్ జిల్లాల మీదుగా యాత్ర కొనసాగుతుంది.

More Telugu News