Election commission: హామీలు ఇచ్చే పార్టీలు వాటిని ఎలా నెరవేరుస్తాయో చెప్పాలి: ఎన్నికల సంఘం

Parties making guarantees must state how funds will be adjusted for their implementation
  • హామీల అమలుకు ఎన్ని నిధులు అవసరమనే అంచనాలూ వెల్లడించాలన్న ఈసీ
  • దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అక్టోబర్ 19 నాటికి స్పందన తెలపాలని ఆదేశం
  • రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య సమాన పోటీ వాతావరణం ఉండాలని వ్యాఖ్య
ఎన్నికలు వస్తే చాలు.. ప్రతి రాజకీయ పార్టీ పెద్ద సంఖ్యలో హామీలు ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. అవి చేస్తామని, ఇవి చేస్తామని, ఏవేవో ఉచితంగా ఇస్తామని చెబుతుంటాయి. వాటిలో డొల్ల హామీలూ ఎక్కువగానే ఉంటాయి. దీనిపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  డొల్ల, ఉచిత హామీల విషయంలో చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు తాజాగా లేఖ రాసింది.

ఎలా నెరవేరుస్తారో చెప్పాలి
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలను నెరవేర్చేందుకు ఎంత డబ్బులు ఖర్చవుతాయి, ఆ నిధులను ఎలా సర్దుబాటు చేస్తారన్న వివరాలను వెల్లడించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ప్రతిపాదనపై అన్ని రాజకీయ పార్టీలు అక్టోబర్ 19వ తేదీలోగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించింది. వాస్తవంగా అమలు చేయగలిగిన హామీలు, వాగ్దానాలను మాత్రమే ఓటర్లు విశ్వసించాల్సి ఉందని స్పష్టం చేసింది.

మేనిఫెస్టోలు, హామీలు హక్కు ఉన్నా..
‘‘దేశంలో రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే చేసే పనులపై హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోలు విడుదల చేయడం వాటి హక్కు అన్న విషయాన్ని ఎన్నికల సంఘం కూడా అంగీకరిస్తోంది. అంత మాత్రాన అలవిమాలిన, అమలుకు వీలుకాని హామీలు ఇవ్వడాన్ని ఉపేక్షించదు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరి మధ్య సమాన పోటీ వాతావరణం ఉండాలి.” అని లేఖలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తాము ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు, ఎలా అమలు చేస్తారన్న అంశాలను అభ్యర్థులు, రాజకీయా పార్టీలు వెల్లడించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది.

More Telugu News

Election commission
EC
CEC
India