హీరో కావడానికి ముందు నాకు కారూ లేదు .. ఇల్లూ లేదు: నాగశౌర్య
- మరో ప్రేమకథగా 'కృష్ణ వ్రింద విహారి'
- నాగశౌర్య జోడీగా షిర్లే సెటియా
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల
ఈ వేదికపై నాగశౌర్య మాట్లాడుతూ .. "ఈ సినిమాను పూర్తిచేయడానికి రెండేళ్లు పట్టింది. కోవిడ్ సమయంలో ఆర్ధికంగా ఎన్నిరకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ, నామీద ఉన్న ప్రేమతో ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వడ్డీలు కడుతూ వచ్చారు. దర్శకుడు అనీష్ కృష్ణ గారి దగ్గర నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నాను.
షెర్లీ చాలా మంచి ఆర్టిస్ట్ .. ఆమెతో కలిసి పనిచేయడం వలన చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కోసం ఒక్కరిని ఒప్పించకపోతే ఆపేద్దామని అనీష్ కి చెప్పాను . ఆ ఒక్కరూ ఎవరో కాదు .. రాధిక గారు. ఆ పాత్రను ఆమె మాదిరిగా మరొకరు చేయలేరు. ఇదే విషయాన్ని ఆమెతో కూడా నేరుగా చెప్పాను. చాలామంది మా దగ్గర డబ్బుంది కనుక సినిమాలు చేస్తున్నామని అనుకుంటారు. కానీ ఇక్కడికి రావడానికి ముందు మాకు కార్లు .. బంగళాలు లేవు. కష్టపడ్డాం .. కలలు నిజం చేసుకున్నాము. ఆ కసి ఉంటే ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు" అని చెప్పుకొచ్చాడు.