Pullela Gopichand: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు నేడు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, అమిత్ షాను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. 

భేటీ అనంతరం గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షాతో కేవలం క్రీడల గురించే మాట్లాడానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు వర్తింపజేసే పథకాల గురించి మాట్లాడానని వివరణ ఇచ్చారు. దేశంలో క్రీడలు, పతకాలు, క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, క్రీడా విధానాల గురించి చర్చించామని తెలిపారు. రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. 

దీనిపై అమిత్ షా ట్వీట్ చేశారు. భారత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్, దిగ్గజ క్రీడాకారుడు గోపీచంద్ ను హైదరాబాదులో కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా అమిత్ షా... మిథాలీ రాజ్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి ప్రముఖులను కలవడం తెలిసిందే.
Pullela Gopichand
Amit Shah
Hyderabad
Badminton
India

More Telugu News