రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే

  • అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఆల‌యం మూత‌
  • నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా మూత‌ప‌డ‌నున్న ఆల‌యం
  • ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన టీటీడీ
తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం రానున్న రెండు నెలల్లో రెండు రోజుల పాటు మూత‌ప‌డ‌నుంది. అక్టోబ‌ర్ నెల‌లో ఒక రోజు, నవంబ‌ర్ నెల‌లో మ‌రో రోజు ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ తెలిపింది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ బుధ‌వారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆల‌యాన్ని మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. అదే మాదిరిగా నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. 

ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం), ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది.

TTD
Tirumala
Tirupati
Eclips

More Telugu News