Student: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఇటీవల విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సురేశ్ అనే విద్యార్థి హాస్టల్ లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ప్రేమ వ్యవహారం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఉరివేసుకున్న స్థితిలో అతడిని గుర్తించిన ఇతర విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. సురేశ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి. అతడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.