అయ్యా కేసీఆర్ గారూ.. మీ కుటుంబ పాలనను అంతం చేయడానికే అమిత్ షా వస్తున్నారు: కిషన్ రెడ్డి

  • మీకు దురదపెడితే మీరు గోక్కోవాలంటూ కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శ
  • కోమటిరెడ్డి మునుగోడు పులిబిడ్డ అంటూ ప్రశంస
  • తప్పు చేయకపోతే కేసీఆర్ కు భయం ఎందుకని ప్రశ్న
అమిత్ షా తెలంగాణకు ఎందుకొస్తున్నారంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారని... అయ్యా కేసీఆర్ గారూ, తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేయడానికే అమిత్ షా వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లికి స్వేచ్ఛను కల్పించడానికి వస్తున్నారని అన్నారు. మునుగోడు సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ తనను గోకకపోయినా, తాను ఆయనను గోకుతానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... అయ్యా కేసీఆర్ గారూ మీకు దురదపెడితే గోక్కోండని ఎద్దేవా చేశారు. 

మునుగోడు పులిబిడ్డ, నల్గొండ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్యే పదవిని కోమటిరెడ్డి తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రతి తెలంగాణ బిడ్డ బుద్ధి చెపుతారని అన్నారు. తప్పు చేయకపోతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించదని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదని అన్నారు.


More Telugu News

Kishan Reddy Amit Shah Komatireddy Raj Gopal Reddy Munugode KCR TRS