Visakhapatnam: అర్ధరాత్రి రైలుపై కూలిన భారీ వృక్షం.. కిరండోల్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Huge tree collapsed  on Visakha Kirandul train
  • విశాఖ నుంచి కిరండోల్ వెళ్తుండగా ఘటన
  • తైడా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య కూలిన వృక్షం
  • విద్యుత్ లైన్ నుంచి చెలరేగిన మంటలు
  • మూడు గంటల తర్వాత బయలుదేరిన రైలు
విశాఖపట్టణం నుంచి కిరండోల్ వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి రైలుపై భారీ వృక్షం ఒకటి కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయంతో రైలు దిగి కటిక చీకట్లోనే పరుగులు పెట్టారు. కిరండోల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి విశాఖ నుంచి బయలుదేరింది. అర్ధరాత్రి అనంతగిరి మండలం తైడా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా పెద్ద వృక్షం ఒకటి రైలు విద్యుత్ లైన్‌పై కూలిపోవడంతో మంటలు చెలరేగాయి.

ఓ వైపు చిమ్మచీకటి, చుట్టూ అడవి కావడంతో ప్రయాణికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందికి దిగారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. దీంతో మూడు గంటల తర్వాత రైలు ముందుకు కదిలింది.

More Telugu News

Visakhapatnam
Kirandul
Train