పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?: నారా లోకేశ్

Lokesh responds in Nandyal incident
  • నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన రౌడీ షీటర్లు 
  • శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తోందన్న లోకేశ్ 
  • దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ 
నంద్యాలలో రౌడీషీటర్లు ఓ పోలీస్ కానిస్టేబుల్ ను వెంటతరిమి హత్యచేసిన వైనం దిగ్భ్రాంతి కలిగించింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. జగన్ రెడ్డి రాజ్యం నేరగాళ్లకు స్వర్గం అని నంద్యాల రౌడీషీటర్లు నిరూపించారని పేర్కొన్నారు. నంద్యాల డీఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ను పట్టణం నడిమధ్యలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యచేశారని అన్నారు. పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటని లోకేశ్  విచారం వ్యక్తం చేశారు. 

వైసీపీ రాక్షస సాలనలో పోలీసుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఒక కాకి చనిపోతే సాటి కాకులు అరుస్తూ గోలచేస్తాయని, కానీ ఒక ఖాకీని చంపేస్తే, నిందితులైన రౌడీషీటర్లు ఎవరో తెలిసినా ఖాకీ బాస్ లు ఇప్పటికీ పట్టుకోలేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోందని విమర్శించారు. 

కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ను అత్యంత దారుణంగా హత్యచేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Nandyal
Police
Murder

More Telugu News