బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు అర్హులనే అంశంలో ప్రజలు ఇంకా నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదు: రిషి సునాక్

  • బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్
  • లిజ్ ట్రస్ తో పోరు హోరాహోరీ
  • త్వరలో ఎన్నికలు.. సెప్టెంబరు 5న ఫలితాలు
  • ప్రజలు తాను చెప్పేది వింటున్నారన్న సునాక్
బ్రిటన్ నూతన ప్రధాని ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సర్వేల్లో లిజ్ ట్రస్ ఆధిక్యం స్పష్టం కాగా, స్కైన్యూస్ నిర్వహించిన డిబేట్లో రిషి సునాక్ నెగ్గడంతో బ్రిటన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ స్పందించారు. బ్రిటన్ ప్రధాని పదవికి తానే అర్హుడ్ని అని స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానిగా పరిష్కరించగలనని ధీమా వ్యక్తం చేశారు. 

అయితే, బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు అర్హులన్న అంశంలో ప్రజలు ఇంకా ఓ నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదని సునాక్ పేర్కొన్నారు. తాను చెప్పే అంశాలను ప్రజలు సానుకూల ధోరణితో వింటున్నారని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించడం, వ్యవస్థల పట్ల పౌరుల్లో నమ్మకం కలిగించడం తదితర అంశాల్లో తన ఆలోచనలు, ప్రజల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని సునాక్ తెలిపారు. 

తన పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, తాను ఎలా పనిచేసిందీ కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు చూశారని వెల్లడించారు. ప్రధానమంత్రిగానూ అదేస్థాయిలో తన పనితీరు ఉంటుందని ఉద్ఘాటించారు.

Rishi Sunak
Prime Minister
Conservative Party
Britain

More Telugu News