మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనాలకు మతిపోయేంతగా డిమాండ్... 30 నిమిషాల్లో లక్ష బుకింగులు

Huge response to Mahindra Scorpio N vehicles pre bookings
మహీంద్రా సంస్థ కొత్తగా తీసుకువస్తున్న స్కార్పియో-ఎన్ వాహనం రోడ్లపై పరుగులు తీయకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. స్కార్పియో-ఎన్ వాహనాల కొనుగోలుకు మహీంద్రా ముందస్తు బుకింగ్ లు ప్రారంభించగా, విపరీతమైన స్పందన వచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్డర్ల స్వీకరణ ప్రారంభం కాగా... కేవలం ఒక నిమిషంలో 25 వేల బుకింగ్ లు వచ్చాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. 

మొత్తం మీద 30 నిమిషాల్లోనే లక్ష బుకింగ్ లతో మహీంద్రా స్కార్పియో-ఎన్ అదరగొట్టింది. ఈ క్రమంలో ఈ బ్రాండ్ న్యూ వాహనం ఓవరాల్ గా రూ.18,000 కోట్లు రాబట్టింది. ఓ కొత్త మోడల్ వాహనానికి, కనీసం వాహన డెలివరీలు ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో బుకింగ్ లు రావడం మార్కెట్ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

స్కార్పియో-ఎన్ వాహనాలను సెప్టెంబరు 26 నుంచి కస్టమర్లకు అందించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 20 వేల యూనిట్లు అందించాలన్నది తమ ప్రణాళిక అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

పెట్రోల్ వెర్షన్ లో స్పార్పియో-ఎన్, దాని వేరియంట్లు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ధర (ఎక్స్ షోరూం) పలుకుతున్నాయి. డీజిల్ వెర్షన్లో స్పార్పియో-ఎన్, దాని వేరియంట్లు రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల వరకు ధర (ఎక్స్ షోరూం) పలుకుతున్నాయి. తొలి 25 వేల యూనిట్లకు 'ప్రారంభ' ధరలు వర్తిస్తాయని, ఆ తర్వాత అమ్ముడయ్యే వాహనాలకు సవరించిన ధరలు వర్తింపజేస్తామని మహీంద్రా సంస్థ పేర్కొంది. 

కాగా, ఇప్పుడు బుకింగ్ చేసుకున్న అందరికీ వాహనాలు అందించాలంటే మహీంద్రా సంస్థకు మరో రెండేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. పాత లోగో కాకుండా స్పార్పియో-ఎన్ వాహనాలను మహీంద్రా సంస్థ తమ కొత్త లోగోతో తీసుకువస్తోంది.
Go Back to Shorts
Scorpio-N
Mahindra
Bookings
India

More Telugu News