స్మృతి ఇరానీ వేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
- ట్వీట్లను తొలగించాలని జై రాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా కు ఆదేశం
- స్మృతి కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని విమర్శించిన కాంగ్రెస్ నేతలు
- రూ. 2 కోట్ల పరువు నష్టం కేసు వేసిన స్మృతి ఇరానీ
ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ మినీ పుష్కర్ణ.. ఇరానీపై చేసిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియా నుంచి ట్వీట్లు, రీట్వీట్లు, పోస్ట్లు, వీడియోలు, ఫొటోలను తొలగించాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ప్రతివాదులు 24 గంటల్లోగా తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాలపై జైరాం రమేశ్ స్పందించారు. వాస్తవాలను కోర్టు ముందు ఉంచుతానని చెప్పారు. స్మృతి వేసిన కేసును సవాలు చేయడంతో పాటు తాము చేసిన ఆరోపణలు నిరూపిస్తామన్నారు.
స్మృతి కూతురు 18 ఏళ్ల జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ఇరానీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని జైరాం డిమాండ్ చేశారు. ఇరానీ కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందని, అందులో నకిలీ లైసెన్స్ తో బార్ నడుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాకు తెలిపారు.