Gujarat: గుజరాత్‌లో ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీమద్యం.. 28కి పెరిగిన మృతుల సంఖ్య

14 booked in Gujarat hooch tragedy after 28 die drinking spurious liquor
షార్ట్స్‌లో చూడండి
గుజరాత్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 28కి పెరిగింది. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిలోనూ పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బోటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో సోమవారం కల్తీ మద్యం తాగిన పలువురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని పలు ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 28 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు నీళ్లు, మిథైల్ ఆల్కహాల్ కలిపిన మద్యాన్ని తాగడమే ఈ విషాదానికి కారణమని తేల్చారు. బాధితుల రక్త నమూనాల్లో మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 14 మందిపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు కోసం ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. మృతుల్లో 22 మంది బోటాడ్ జిల్లా వారు కాగా, మిగతా వారు చుట్టుపక్కల జిల్లాల వారు. మద్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ మద్యం కారణంగా గత 15 ఏళ్లలో 845 మంది ప్రాణాలు కోల్పోయారు.

అహ్మదాబాద్‌లోని ఓ పరిశ్రమల గోదాములో మేనేజర్‌గా పనిచేస్తున్న జయేష్ 600 లీటర్ల మిథైల్ ఆల్కహాల్‌ను దొంగిలించి బోటాడ్‌లోని తన బంధువైన సంజయ్‌కు రూ.40 వేలకు విక్రయించాడు. అతడు దానిని జిల్లాల్లో పలువురికి విక్రయించాడు. వారు అందులో నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేసి విక్రయించారు. నిందితుల వద్ద ఇంకా మిగిలి ఉన్న 460 లీటర్ల మిథైల్ ఆల్కహాల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
Gujarat
Hooch Tragedy
Spurious Liquor
Methyl Alcohol

More Telugu News