హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు కర్ణాటక యువకుల మృతి

  • నగరంలోని బంధువుల ఇంటికి వచ్చిన యువకులు
  • అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
  • కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్న పోలీసులు
బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్‌ను ఢీకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని సోమాజీగూడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్‌పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజీగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. 

ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Hyderabad
Somajiguda
Metro Pillar
Road Accident

More Telugu News