Madhya Pradesh: రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ బేరసారాలకు దిగుతోంది: యశ్వంత్ సిన్హా

రాష్ట్రపతి ఎన్నికలను కూడా బీజేపీ వదలడం లేదని, ఇందులోనూ ఆ పార్టీ బేరసారాలకు దిగుతోందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. భోపాల్‌లో నిన్న కాంగ్రెస్ శాసనసభ్యులతో సమావేశమైన ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ దినపత్రికలో ఈ ఉదయం వచ్చిన వార్త చూసి తాను ఆశ్చర్యపోయానని సిన్హా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది గిరిజన ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను పడిందని, క్రాస్ ఓటింగుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ వార్తలో రాశారని ఆయన పేర్కొన్నారు.

దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి జరుగుతున్న ఎన్నికలను కూడా బీజేపీ వదలడం లేదని, బేరసారాలకు పాల్పడుతూ ‘ఆపరేషన్ కమల్’ నిర్వహిస్తోందని అన్నారు. నిజానికి అది ‘ఆపరేషన్ మురికి’ అని అభివర్ణించారు. ఆపరేషన్‌లో భాగంగా బీజేపీయేతర ఎమ్మెల్యేలకు బీజేపీ పెద్దమొత్తంలో డబ్బులు అందజేస్తోందని ఆరోపించారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రతిపక్షాల మధ్య మనస్పర్థలు తెచ్చేందుకు బీజేపీ ఇలాంటి మురికి రాజకీయాలకు పాల్పడుతోందని సిన్హా ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఎన్నికల సంఘం, రాజ్యసభ ప్రధాన కార్యదర్శిని డిమాండ్ చేశారు.
Madhya Pradesh
Bhopal
Yashwant Sinha
BJP

More Telugu News