Lakshman: తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా, డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చారు: కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

  • కేసీఆర్ కు షిండే, డబుల్ ఇంజిన్ సర్కార్ భయం పట్టుకుందన్న లక్ష్మణ్ 
  • మోదీని తిడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరని వ్యాఖ్య 
  • మిషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందన్న బీజేపీ ఎంపీ 
BJP Lakshman fires on KCR

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కు షిండే, డబుల్ ఇంజిన్ సర్కార్ భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్ అసహనానికి గురవుతున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాతో మోదీ పాలన సాగుతోందని... మరోవైపు తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా, డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా కేసీఆర్ మార్చారని దుయ్యబట్టారు. 

అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్... కేంద్రంలో కూడా తెలంగాణ తరహా పాలనను తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. మోదీని తిడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశాన్ని ఇస్తే కేసీఆర్ కు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. 

దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని... ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయబోతున్న మోదీ గురించి మాట్లాడే అర్హత కూడా కేసీఆర్ కు లేదని చెప్పారు. కేసీఆర్ ఫైటర్ కాదని, ఆయనొక చీటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిషన్ తెలంగాణ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని లక్ష్మణ్ తెలిపారు.

More Telugu News