YS Vijayamma: నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న ఆ రాజకీయనేత గొంతు ఆరిపోయేలా చేశాడు నా బిడ్డ:. వైఎస్ విజయమ్మ పూర్తి ప్రసంగం ఇదిగో!

  • నేడు వైసీపీ ప్లీనరీ ప్రారంభం
  • గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ చివరి ప్రసంగం
  • పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన
  • జగన్ పై ప్రశంసల వర్షం
  • మూడు దశాబ్దాల విజన్ ఉన్న నేత అంటూ కితాబు
Vijayamma full speech

వైసీపీ ప్లీనరీలో పార్టీ గౌరవాధ్యక్షురాలు హోదాలో వైఎస్ విజయమ్మ చివరి ప్రసంగం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన ప్రతి హృదయానికి, నన్ను, నా బిడ్డలను అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా అంటూ ప్రసంగం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి తనవాడు మాత్రమే కాదని, అందరివాడు అని పేర్కొన్నారు. జగమంత కుటుంబం నాది అంటూ ప్రతి మనిషి పట్ల ప్రేమను చూపిన వ్యక్తి వైఎస్సార్ అని తెలిపారు. తన ప్రజా ప్రస్థానంలో ప్రతి మలుపు జనజీవనంతో ముడిపడి ఉందని చెబుతూ ఉండేవారని పేర్కొన్నారు. వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లయినా, ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచే ఉన్నారని విజయమ్మ వెల్లడించారు. 

"ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశాలు జరుపుకున్నాం. ఇవాళ మూడోసారి సగర్వంగా ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నాం. మా ప్రభుత్వం ఇది చేసింది అని ఇవాళ ఈ ప్లీనరీలో గర్వంగా చెప్పుకోగలం. ఇచ్చిన మాట కోసం పుట్టిన పార్టీయే వైసీపీ. నాడు వైఎస్సార్ ప్రమాదంలో చిక్కుకుని మిస్సింగ్ అని తెలిశాక 700కి పైగా గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాల ఆక్రందన నుంచి పుట్టిందే ఈ వైసీపీ. 

నాడు భారతదేశంలోని శక్తిమంతమైన వ్యవస్థలన్నీ నా బిడ్డపై దాడి చేశాయి. కానీ మనం చేస్తున్నది మంచి, మనం చేస్తున్నది ధర్మం, మనం చేస్తున్నది న్యాయం అని నమ్మి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని నిశ్చయించుకుని, అరెస్ట్ లంటూ భయపెట్టే మాటలు చెప్పినా వెనుకంజ వేయకుండా, కష్టాల బాట ముందు ఉందని తెలిసినా లెక్కచేయకుండా మీ కన్నీటిని తుడిచేందుకు ఏర్పాటైన పార్టీయే వైసీపీ. 

మనం ఊహించినట్టుగానే ఎన్నో కష్టాలు వచ్చాయి. అక్రమంగా ఎన్నో కేసులు పెట్టారు, అనేక దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి... ఉప ఎన్నికల సమయంలో విచారణ అని చెప్పి జైల్లో పెట్టారు, ఆస్తులు అటాచ్ చేశారు. షర్మిల పాదయాత్ర, జగన్ పాదయాత్ర.... ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, కష్టపడి ఈ స్థాయికి వచ్చింది వైసీపీ. 

నాడు కాంగ్రెస్ పార్టీ పొమ్మనకుండా పొగబెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నో మానవతా విలువలతో 2011లో ఈ పార్టీ పుట్టింది. పేదల అవసరాలు తీర్చేందుకే ఈ పార్టీ పుట్టింది. పార్టీ అంటే ప్రజల అభిమానం, పార్టీ అంటే నాయకత్వం. జగన్ బాబు ఓర్పుతో, సహనంతో, అచంచల విశ్వాసంతో, గుండెనిండా ధైర్యంతో, రైతులపై అభిమానంతో, నేలతల్లిపై గౌరవంతో ముందుకు నడిచాడు.

బైబిల్ లో ఓ వాక్యం ఉంది. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించబడతాడు అనే వాక్యాన్ని నమ్మి ఆచరించి, కృషితో నాస్తి దుర్భిక్షం అనే వేదవాక్యాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేశాడు. ఈ రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న ఓ సీనియర్ రాజకీయనేత గొంతు ఆరిపోయేలా చేశాడు నా బిడ్డ. 

జగన్ దృష్టిలో రాజకీయాలంటే అసత్యాల ప్రచారం కాదు. ప్రతిపక్షాలు ఏ ప్రచారం చేస్తున్నాయన్నది జగన్ ఎప్పుడూ పట్టించుకోలేదు. తనను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలనే జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఇవాళ తాను అమలు చేస్తున్న పథకాల ద్వారా గడపగడపకు ఎమ్మెల్యేలను ధైర్యంగా పంపగలుగుతున్నాడు. 

ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలికుడు, ఇవాళ జగన్ చేతిలో ఓడిపోయి 23 సీట్లతో సరిపెట్టుకున్న నాయకుడు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన ఆ నాయకుడు గుర్తుంచుకోదగిన విధంగా అమలు చేసిన పథకం ఒక్కటైనా ఉందా? అలాంటి పథకం ఇప్పటికీ నిలిచి ఉందా? తాను చేసిన పాలన గురించి, కనీసం ఒక్క పథకం గురించైనా ఆ నాయకుడు చెప్పుకోగలడా? ఎన్టీఆర్ తీసుకువచ్చిన పథకాలను కూడా పక్కనబెట్టిన వ్యక్తి ఆ నేత. 

కానీ జగన్ అలా కాదు... మూడు దశాబ్దాలకు అవసరమైన విజన్ ఉన్న వ్యక్తి. ఇకముందు కూడా జగన్ పాలన కొనసాగుతోంది. మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతాడన్న విశ్వాసం నాకుంది. 

ఇక నా విషయానికొస్తే పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేను. ఒంటరిపోరాటం చేస్తున్న షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నా మనస్సాక్షి ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నా. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నన్ను క్షమించాలి. విమర్శలకు, వక్రీకరణలకు తావులేని విధంగా ఉండేందుకు గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేస్తున్నా. 

మా కుటుంబంలో ఎప్పుడూ స్పర్థలు లేవు. వేరే రాష్ట్రంలో రాజకీయంగా షర్మిలకు తోడుగా ఉన్నా, తల్లిగా ఇక్కడ జగన్ కు దగ్గరగానే ఉంటాను. మొన్ననే నా సంతకంతో, నేను రాయని ఓ రాజీనామా లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ లేఖను చూశాక ఎంత దిగజారిపోయారో అనిపించింది" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News