Narendra Modi: బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితి ఏంటి?: ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన ఎస్పీజీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని పర్యటనలో సంచలన ఘటన చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరంకు మోదీ హెలికాప్టర్ లో పయనమైన సమయంలో కొందరు వ్యక్తులు నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ వ్యాఖ్యానించింది. బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగురవేసి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ, ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని చెప్పారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారని అన్నారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని... నోటితో గాలి ఊది బెలూన్లను ఎగరేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బెలూన్లను ఎగురవేశారని తెలిపారు. సుంకర పద్మశ్రీ, సావిత్రి, రాజీవ్ రతన్ వంటి వారు ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు.
Narendra Modi
Helicopter
Black Balloons
SPG
Krishna District
District Collector

More Telugu News