చదువు చెప్పడం ఎలాగూ చేతకాదు, మంచి తిండి అన్నా పెట్టి చావండి: ప్రభుత్వంపై ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆగ్రహం

RS praveen kumar slams govt over food poison incidents in gurukula schools
  • సిద్దిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత ఘటనలపై ప్రవీణ్ స్పందన
  • గతంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పని చేసిన ప్రవీణ్
  • ఆయన హయంలో గురుకులాలకు మంచి పేరు
సిద్దిపేట, గద్వాల జిల్లాల్లోని గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ సిద్దిపేటలో మైనారిటీ బిడ్డల విషాహారం ఘటన మరవకముందే మళ్లీ గద్వాల జిల్లా గట్టులో ఎస్సీ బిడ్డలకు విషాహారం! మీకు మా పిల్లలకు చదువు చెప్పడం ఎలాగూ చేతకాదు, మంచి తిండి అన్నా పెట్టి చావండి. ప్రజలారా, ఇంకెన్నాళ్లు భరిద్దాం ఈ పందికొక్కులను?’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రవీణ్ కుమార్ చాన్నాళ్ల పాటు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా పని చేశారు. ఆయన హయంలో గురుకులాలకు మంచి పేరు వచ్చింది.
 
కాగా, సిద్దిపేట శివారులోని మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లో సోమవారం 128 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతతకు గుర‌య్యారు. ఆదివారం రాత్రి  మిగిలిన చికెన్‌ గ్రేవీతో క‌లిపి వంకాయ‌ను వ‌డ్డించడంతో విద్యార్థుల‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. సోమవారం నాటికి వారికి క‌డుపు నొప్పి తీవ్రం కావ‌డంతో వారంతా అధికారుల‌కు తెలిపారు. దీంతో అధికారులు విద్యార్థుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మరోవైపు గద్వాల జిల్లా గట్టులోని బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 65 మంది విద్యార్థినులు ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. చికెన్ తినడం వల్లే బాలికలు అస్వస్థతకు గురయ్యారని వైద్యాధికారులు చెప్పారు.
Go Back to Shorts
RS praveen kumar
bsp telangana
gurukula schools
food poison

More Telugu News