తొలిసారి ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ చరిత్ర సృష్టించింది: సోము వీర్రాజు 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ల పేర్లు కూడా తెరపైకి వచ్చినా, ఏమాత్రం అంచనాలకు తావివ్వని రీతిలో బీజేపీ అధినాయకత్వం ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. దేశంలో తొలిసారిగా ఓ ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి బీజేపీ చరిత్ర సృష్టించిందని తెలిపారు. 

'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అనే మాటను అక్షరసత్యం చేసి చూపించారని కొనియాడారు. అందుకుగాను, ప్రధాని నర్రేంద మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వీర్రాజు వెల్లడించారు. వ్యవస్థను నడపడంలో అందరి పాత్ర ఉందని బీజేపీ అధినాయకత్వం మరోమారు నిరూపించిందని పేర్కొన్నారు. 

బీజేపీకి మూడు పర్యాయాలు అవకాశం వస్తే మొదటిసారి ముస్లింకి, రెండవసారి ఎస్సీకి, మూడవసారి ఎస్టీ మహిళకు అవకాశం కల్పించడం హర్షణీయం అని వివరించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు సోము వీర్రాజు వెల్లడించారు.

Somu Veerraju
Droupadi Murmu
President Of India
Candidate
NDA
BJP
India

More Telugu News