Prime Minister: ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చి చెత్త ఏరిన ప్ర‌ధాని మోదీ... వైర‌ల్ అవుతున్న వీడియో ఇదిగో

  • ఢిల్లీలో రూ.920 కోట్ల‌తో ఐటీపీఓ ట‌న్నెల్ నిర్మాణం
  • ఆదివారం ప్రారంభించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • కారిడార్‌లో పెంకులు, కూల్ డ్రింక్ బాటిళ్ల‌ను స్వయంగా తీసిన ప్ర‌ధాని
  • మోదీ అంకిత భావాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్ర‌ముఖులు
pm modi pick up little scraps and pieces at itpo tunnel inauguration in delhi

భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ల‌భించిన ప‌థ‌కాల్లో స్వ‌చ్ఛ భార‌త్ ఒక‌టి. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే దిశ‌గా ప్రారంభించిన ఈ ప‌థ‌కం దేశంలో ప‌లు విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప‌థ‌కం అమ‌లు ప‌ట్ల మోదీ స‌ర్కారు కూడా కీల‌క శ్ర‌ద్ధ పెట్టింది. ఈ ప‌థ‌కానికి మోదీ ఎంత‌గా ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఆదివారం ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారిపోయింది. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రూ.920 కోట్ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ ప్ర‌గ‌తి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొత్త నిర్మాణాన్ని ప‌రిశీలించేందుకు ఒంటరిగా కారిడార్‌లోకి ప్ర‌వేశించిన మోదీ... అక్క‌డ క‌నిపించిన చిన్న చిన్న పెంకుల‌ను స్వ‌యంగా వంగి మ‌రీ త‌న చేతుల‌తో తీశారు. ఆ త‌ర్వాత అటుగా న‌డుస్తూ కారిడార్‌ గోడ‌కు అనుకుని ప‌డిపోయిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను కూడా మోదీ త‌న చేతుల‌తోనే తీశారు. ఈ దృశ్యాల‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ కాగా... ప్ర‌ముఖులు మోదీ అంకిత భావాన్ని ఆకాశానికెత్తేస్తూ వ‌రుస‌బెట్టి స్పందిస్తున్నారు. దీంతో ఈ వీడియో క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది.

More Telugu News