బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం... ఇది అతిపెద్ద మైలురాయి అని అభివర్ణించిన సీఎం జగన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య
- బైజూస్ తో ఎంవోయూ
- టెక్ట్స్ పుస్తకాల్లో మార్పులు
- వచ్చే ఏడాది నుంచి అమలు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇదొక అతిపెద్ద మైలురాయి వంటి ఘట్టం అని అభివర్ణించారు. బైజూస్ తో ఒప్పందం ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలమని అన్నారు.
"ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు బైజూస్ ఎడ్యుకేషన్ ను పొందాలంటే ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడదే బైజూస్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందుబాటులోకి వస్తోంది.
4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజూస్ ఎడ్యుకేషన్ కు అనుగుణంగా టెక్ట్స్ బుక్స్ లో మార్పులు చేస్తాం. ఎంవోయూ కుదిరింది ఇప్పుడే కాబట్టి వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్ కు అనుగుణంగా టెక్ట్స్ బుక్స్ రూపొందిస్తాం. ఈ ఏడాది పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయ్యాయి. వచ్చే ఏడాది నుంచి టెక్ట్స్ పుస్తకాలు ద్విభాషల్లో ఉంటాయి. ఒక పేజీలో తెలుగులో, మరో పేజీలో ఇంగ్లీషులో కంటెంట్ ఉంటుంది.
దృశ్య మాధ్యమం ద్వారా బోధన కొరకు ప్రతి క్లాస్ రూమ్ లో టీవీ ఏర్పాటు చేస్తాం. తద్వారా విజువల్, డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. నాడు-నేడులో భాగంగా ఈ టెలివిజన్ లు ఏర్పాటవుతాయి. 8, 9, 10వ తరగతులు విద్యార్థి దశలో చాలా కీలకం. అందుకే విద్యాపరమైన వారి ఎదుగుదల కోసం 8వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ట్యాబ్ లు అందజేస్తాం. సీబీఎస్ఈ పరీక్షలు పాస్ అయ్యేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం 4.70 లక్షల మందికి ట్యాబ్ లు ఇవ్వనున్నాం" అని సీఎం జగన్ వివరించారు. కాగా, ఈ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు.