సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా తల్లులకు రూ.5 వేలు: సీఎం జగన్ ఆదేశం
- వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష
- పలు అంశాలపై నిర్ణయాలు
- సహజ ప్రసవాలు పెంచాలని సూచన
- అవగాహన పెంచాల్సిన బాధ్యత వైద్యులదేనని వెల్లడి
ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. అయితే సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఈ దిశగా అవగాహన, చైతన్యం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం కిందకు మరిన్ని చికిత్సలు తీసుకురావాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2,446 రకాల చికిత్సలు అమల్లో ఉన్నాయని సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్ కింద ఏపీకి రూ.223 కోట్లు వచ్చాయని, ఈ సంవత్సరం రూ.360 కోట్లు రావొచ్చని పేర్కొన్నారు.