Satyam scandal: సత్యం కుంభకోణం: రామలింగరాజు తల్లికి హైకోర్టులో ఊరట

TS High Court gave relief to Satyam Ramalinga Rajus Mother

  • కుంభకోణంలో రామలింగరాజు తల్లి కూడా లబ్ధిదారేనన్న సీబీఐ
  • లావాదేవీలన్నీ ఆమె బ్యాంకు ఖాతా ద్వారానే జరిగాయని అభియోగాలు
  • ఆమె బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్
  • ఖాతాను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు

సత్యం కుంభకోణంలో రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ (85)కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కుంభకోణంలో ఆమె కూడా లబ్ధిదారేనంటూ గతంలో ఆమె బ్యాంకు ఖాతాలను సీబీఐ ఫ్రీజ్ చేసింది. రామలింగరాజు అక్రమంగా సంపాదించిన ఆస్తులు, షేర్లు, తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, ఇతర లావాదేవీలు అన్నీ అప్పలనరసమ్మ బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. తన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై రామలింగరాజు తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

తాను వృద్ధురాలినని, తన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల జీవనభృతి కోసం దాచుకున్న సొమ్ము అందులో చిక్కుకుపోయిందని, కాబట్టి జీవనం కష్టంగా ఉందని పేర్కొన్నారు. తన ఖాతాల్లో ఉన్న సొమ్మును వినియోగించుకునేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విచారించిన జస్టిస్ రాధారాణి నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు ఊరట కలిగేలా తీర్పు ఇచ్చింది. కరూర్ వైశ్యాబ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇతర బ్యాంకుల్లో ఆమెకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను, బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News