మాస్క్ పెట్టుకోకుంటే విమానం నుంచి బలవంతంగా దించేయండి: ఢిల్లీ హైకోర్టు

  • ఎయిర్ పోర్టుల్లోనూ ఇదే అమలు చేయాలని ఆదేశం
  • కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ ఫైన్లు వేయాలని ఆజ్ఞ
  • కఠిన నిబంధనలు రూపొందించాలంటూ డీజీసీఏకు సూచన
కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాలు, విమానాల్లో మాస్కు నిబంధనను తప్పనిసరి చేయాలంటూ ఆదేశించింది. కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని సూచించింది.

విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలను బేఖాతరు చేయడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించింది. కరోనా రూల్స్ పాటించని వారికి భారీ జరిమానాలు వేయాలని జస్టిస్ సంఘీ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిని అవసరమైతే విమానాలు, విమానాశ్రయాల నుంచి బయటకు బలవంతంగా పంపించివేయాలని తేల్చి చెప్పారు. 

మాస్కులు పెట్టుకోవాలని చెప్పేది కరోనా ముప్పును తగ్గించేందుకేనని, ఇప్పటికే నియమ నిబంధనల్లో మాస్కు తప్పనిసరి అని పేర్కొన్నారని గుర్తు చేశారు. తినేటప్పుడు, తాగేటప్పుడు మాస్క్ తీస్తే ఎవరూ వద్దనరని, విమాన ప్రయాణంలో మిగతా సమయాల్లో మాత్రం తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు అనుగుణంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన నిబంధనలను రూపొందించాలని జస్టిస్ సంఘీ ఆదేశాలిచ్చారు.


More Telugu News

COVID19 Mask New Delhi High Court