ఎండలతో ఉడుకుతున్న కోస్తా.. నేటి నుంచి వడగాల్పుల హోరు!

అధిక ఉష్ణోగ్రతలతో కోస్తాంధ్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండపేటలో నిన్న అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పడమర నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఎండలు పెరిగినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, నిన్న వడగాల్పులు వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉండడం, వర్ష సూచన లేకపోవడంతో కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచినట్టు చెప్పారు. 

అలాగే, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు మిగిలిన జిల్లాల్లోని 64 మండలాల్లో నేటి నుంచి వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, రాయలసీమలో మాత్రం భిన్నమైన వాతావరణం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.


More Telugu News