రాజద్రోహ చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు
- ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయద్దన్న సుప్రీం
- సమీక్ష పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనని ఆదేశం
- పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సి ఉందని వ్యాఖ్య
ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 124ఏ కింద (రాజ ద్రోహాన్ని ఈ సెక్షన్ కిందే విచారిస్తున్నారు) కేసులు నమోదై, జైళ్లలో ఉన్న వారు ఉపశమనం, బెయిల్ కోసం తగిన న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. ఈ చట్టాన్ని పునరాలోచించే దిశగా డ్రాఫ్ట్ ను కేంద్రం రూపొందించినట్టు అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. రాజ ద్రోహం అభియోగాల కింద కేసు నమోదుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఎస్పీ ర్యాంకు పోలీసు అధికారి భావించినప్పుడే చేయాల్సి ఉంటుందని వివరించారు. చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసుల నమోదును నిలిపివేయడం సరికాదని వాదించారు.
కానీ, ఈ వాదనల పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషన్లర్లు పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. హనుమాన్ చాలీసా పారాయణం చేసినా రాజద్రోహం అభియోగాలతో కేసు పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతుందోని పేర్కొంటూ.. సమీక్ష పూర్తయ్యే వరకు నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది.