Bengal Monitor Lizard: మహారాష్ట్రలో దారుణం.. బెంగాల్ మానిటర్ లిజర్డ్‌పై నలుగురు వ్యక్తుల అత్యాచారం

  • సహ్యాద్రి టైగర్ రిజర్వులో ఘటన
  • భారీ బల్లిపై అత్యాచారం చేసి మొబైల్‌లో చిత్రీకరణ
  • నేరం రుజువైతే ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష
Bengal monitor lizard raped in Maharashtra Officials arrested 4 Hunters

మహారాష్ట్రలో దారుణం జరిగింది. గోథానే గ్రామ సమీపంలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో నలుగురు వేటగాళ్లు ఓ బెంగాల్ మానిటర్ లిజర్డ్ (భారీ బల్లి)పై అత్యాచారానికి పాల్పడ్డారు. గభా ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ జోన్‌లోకి ప్రవేశించిన నిందితులైన వేటగాళ్లు ఈ దారుణ నేరానికి పాల్పడ్డారు. నిందితులను సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు.

మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ఓ నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు నలుగురు ఈ భారీ బల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వారు తమ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో అడవిలో తిరుగుతున్న వీరిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో విషయం బయటపడింది.

నిందితులు కొంకణ్ నుంచి కొల్హాపూర్ చందోలి గ్రామానికి వచ్చారని, వేట కోసం వారు అడవిలో చొరబడినట్టు అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం బెంగాల్ మానిటర్ లిజర్డ్‌ అరుదైన జాతి. నేరం రుజువైతే నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

More Telugu News