తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... వ్యాన్ లోయలో పడి 11 మంది దుర్మరణం

  • తిరుపత్తూరు జిల్లాలో ఘటన
  • ప్రమాద సమయంలో వ్యాన్ లో 30 మంది
  • ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్
  • మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపత్తూరు జిల్లా జువ్వాదిమలై ప్రాంతంలో ఓ వ్యాన్ లోయలో పడిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వ్యాన్ పై అదుపు కోల్పోవడంతో లోయలోకి పడిపోయినట్టు భావిస్తున్నారు. తొలుత ఓ స్తంభాన్ని ఢీకొన్న వ్యాన్, ఆపై లోయలోకి జారిపోయింది. ప్రమాద తీవ్రతను పరిశీలిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. 

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించారు.

Road Accident
Tirupathur
Van
Tamilnadu

More Telugu News