Sri Lanka: శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలు!

Sri Lanka people suffering with food shortage
  • ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
  • పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిలబడి స్పృహ కోల్పోతున్న లంకేయులు
  • కాగితం కొరతతో వాయిదా పడిన పరీక్షలు
శ్రీలంక పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోంది. ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ఎంతో మంది ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. సరిపడా ఇంధనం లేకపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. 750 మెగావాట్ల విద్యుత్ కొరతతో శ్రీలంక సతమతమవుతోంది. విదేశాల నుంచి డీజిల్ వచ్చినప్పటికీ, డబ్బులు చెల్లించకపోవడంతో దాన్ని అన్ లోడ్ చేయలేకపోతున్నారు. శుక్రవారానికి ఆ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు, డీజిల్ కొనుగోలు కోసం బంకుల వద్ద ఎవరూ బారులు తీరొద్దని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద మండుటెండలో క్యూ లైన్లలో నిల్చుంటున్నవారిలో పలువురు స్పృహ కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

శ్రీలంకలో ప్రస్తుతం రోజుకు 10 గంటల సేపు కరెంట్ కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రోడ్లపై అంధకారం నెలకొంటోంది. కొన్ని రెస్టారెంట్లు కొవ్వొత్తుల వెలుగుల్లోనే వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ఔషధాల కొరత కూడా శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసరం కాని ఆపరేషన్లను ఆసుపత్రులు వాయిదా వేస్తున్నాయి. కాగితం కొరత కూడా లంకను చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ నెలలో విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
Sri Lanka
Food
Crisis

More Telugu News