Rohit Sharma: ఢిల్లీ చేతిలో ఓడిన ముంబైకి మరో ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మకు రూ. 12 లక్షల జరిమానా

ఐపీఎల్‌లో భాగంగా నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్  ప్రారంభించిన ఢిల్లీ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 

ముంబై నిర్దిష్ట సమయంలో తన బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోవడంతో ఈ జరిమానా విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోవడమే తమ ఓటమికి కారణమన్నాడు. తాము ఏ మ్యాచ్‌కైనా ఒకే రకమైన సన్నద్ధతతో బరిలోకి దిగుతామన్నాడు. అయితే, పరిస్థితులు కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు. విజయం నిరాశ కలిగించిందని, తర్వాతి మ్యాచుల్లో పుంజుకుంటామని చెప్పుకొచ్చాడు.
Rohit Sharma
IPL 2022
Fine
Slow Over Rate
Mumbai Indians

More Telugu News