MS Dhoni: పాత ధనాధన్ ధోనీ కనిపించాడు... గౌరవప్రదమైన స్కోరు సాధించిన చెన్నై

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ధోనీ ధనాధన్ ఆటతీరు ఆవిష్కృతమైంది. జట్టు కష్టాల్లో పడడంతో, పాత ధోనీ కనిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను చివరి ఓవర్లలో ఓ ఆటాడుకున్నాడు. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఓ దశలో చెన్నై జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా ఆదుకున్నారు. 

ముఖ్యంగా ధోనీ దూకుడైన ఇన్నింగ్స్ సాయంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ధోనీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 50 పరుగులు చేశాడు. అతడికి జడేజా నుంచి చక్కని సహకారం లభించింది. జడేజా 28 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ జోడీ చివరి 5 ఓవర్లలో 58 పరుగులు రాబట్టడం విశేషం. రసెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి బంతిని జడేజా సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. 

అంతకుముందు, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 3 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాబిన్ ఊతప్ప 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు చేశాడు. రాయుడు (15) రనౌట్ కాగా, యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే 3 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 1, ఆండ్రీ రస్సెల్ 1 వికెట్ తీశారు.
MS Dhoni
CSK
Ravindra Jadeja
KKR
IPL

More Telugu News