వారి ఫిట్ నెస్ పై మాకు సమాచారం లేదు: సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్
- బెంగళూరు ఎన్ సీఏలో ఉన్నారు
- వారు ఫిట్ గా ఉంటే బీసీసీఐ మాకు సమాచారం ఇస్తుంది
- ఫిట్ నెస్ నివేదిక కోసం వెయిటింగ్ అన్న సీఈఓ
గతేడాది కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను చేతి గాయం వేధిస్తోంది. దీంతో శ్రీలంకతో టీ20 మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ నెల 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తో సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
కీలక ఆటగాళ్లకు సంబంధించి తాజా ఫిట్ నెస్ సమాచారం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఎప్పుడు వారు వచ్చి జట్టులో చేరతారన్నది చెప్పలేమన్నారు. ‘‘మ్యాచ్ ఆడేందుకు ఫిట్ గా ఉంటే ఆ సమాచారం బీసీసీఐ మాకు తెలియజేస్తోంది. వారు ప్రస్తుతం బెంగళూరులోని ఎన్ సీఏ కేంద్రంలో ఉన్నారు’’ అని విశ్వనాథ్ స్పష్టం చేశారు.
ప్లేయర్లు ఎవరైనా ఎన్ సీఏలో రిహాబిలిటేషన్ అనంతరం ఫిట్ నెస్ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూరత్ లోని లాల్ భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ చేస్తోంది.