హైదరాబాద్ లో వరద నీటి కాల్వలు.. రూ.985 కోట్లతో నిర్మాణం: కేటీఆర్

Taking Up SNDP For Flood Control Canals in Hyderabad Says KTR
  • గత ఏడాది వచ్చిన వానల అనుభవంతో నిర్ణయం
  • జీహెచ్ఎంసీతో పాటు పరిసర మున్సిపాలిటీల్లోనూ పనులు
  • తానే స్వయంగా సమీక్షిస్తున్నానన్న మంత్రి
వరద నీటి కోసం, మురుగు నీటి కోసం వేర్వేరు కాల్వలు ఉండాల్సిన అవసరం ఉందని, కానీ, గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో ఆ విషయాన్ని విస్మరించాయని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  అన్నారు. నాలాలపై దశాబ్దాలుగా వేలాది ఆక్రమణలూ ఉన్నాయని చెప్పారు. 

గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన వానల తర్వాత ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఎస్ఆర్ డీపీ లాగానే వరద నీటి కాల్వల నిర్మాణానికి ఎస్ఎన్ డీపీని చేపట్టబోతున్నామని చెప్పారు. దాని కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగాన్నీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీనా, బయటి మున్సిపాలిటీనా అన్న తేడా లేకుండా.. రూ.985.45 కోట్లతో ఎస్ఎన్ డీపీ మొదటి దశ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. .

సికింద్రాబాద్ జోన్ లో రూ.257.40 కోట్లు, కూకట్ పల్లిలో రూ.112.8 కోట్లు, ఎల్బీనగర్ లో రూ.113.59 కోట్లు, చార్మినార్ లో రూ. 93.28 కోట్లు, ఖైరతాబాద్ లో రూ.137.12 కోట్లు, శేరిలింగంపల్లి జోన్ లో రూ.20.8 కోట్లను ఇస్తున్నామన్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.735 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆవల జల్ పల్లిగానీ, కొంపల్లి వంటి మున్సిపాలిటీలన్నింటిలో మరో రూ.250 కోట్లతో ఎస్ఎన్ డీపీ పనులు చేస్తామన్నారు. ఎస్ఎన్ డీపీ కింద మొత్తంగా 60 పనులను చేపడతామన్నారు. 

ఈ పనుల పురోగతిపై ప్రతి వారం తానే స్వయంగా సమీక్షిస్తున్నానన్నారు. ముగ్గురు చీఫ్ ఇంజనీర్లను పనుల పర్యవేక్షణకు నియమించామన్నారు. వర్షాకాలం వచ్చేలోపు ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నామని కేటీఆర్ వివరించారు. యుద్ధప్రాతిపదికన పనులను చేస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Telangana
KTR
Rains
Floods
Hyderabad

More Telugu News