'సాధారణ పౌరులనూ చంపేస్తున్నాం.. భయంగా ఉందమ్మా' అంటూ తల్లికి రష్యా సైనికుడి చివరి సందేశం

Russia Soldier Last Message To His Mother
  • యుద్ధ ట్యాంకుల కింద నలిగిపోతున్నారంటూ ఆవేదన
  • ఫాసిస్టులంటూ తమను పిలుస్తున్నారని విచారం
  • ఐరాస సభలో మెసేజ్ చదివి వినిపించిన ఉక్రెయిన్ రాయబారి
ప్రజలపై దాడులు చేయట్లేదని రష్యా పదేపదే ప్రకటిస్తున్నా.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రజల నివాస సముదాయాలపై రష్యా దాడులు చేసింది. దాడుల్లో ఇప్పటికే 350 మందికిపైగా పౌరులు చనిపోయారని, అందులో 17 మంది చిన్నారులున్నారని ఉక్రెయిన్ ప్రకటించింది. తాజాగా రష్యా సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం ఒకటి సంచలనం సృష్టిస్తోంది. 

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఆ సందేశాన్ని ఉక్రెయిన్ రాయబారి చదివి వినిపించారు. ‘‘చాన్నాళ్లయింది మాట్లాడి.. ఎందుకు స్పందించట్లేదు? నేను నీకో పార్సిల్ పంపిస్తాను’’ అంటూ ఆ సైనికుడికి తొలుత తల్లి సందేశం పంపింది. దానికి స్పందించిన ఆ సైనికుడు.. 'ఉరేసుకుని చావాలనిపిస్తోంది అమ్మా' అంటూ జవాబిచ్చాడు. 

‘‘అమ్మా.. నేను ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్నా. నాకు చాలా భయంగా ఉంది. అన్ని నగరాలపైనా బాంబులతో విరుచుకుపడుతున్నాం. సామాన్య పౌరులనూ వదలకుండా లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఉక్రెయినియన్లు మాకు ఎదురొస్తారని అన్నారు. వాళ్లంతా మా యుద్ధ ట్యాంకుల కిందపడి ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. మమ్మల్ని ముందుకు పోనివ్వట్లేదు. మమ్మల్ని ఫాసిస్టులు అని పిలుస్తున్నారు. చాలా కష్టంగా ఉందమ్మా’’ అంటూ తల్లికి మెసేజ్ పంపాడు. ఆ తర్వాత అతడు ఉక్రెయిన్ దళాల దాడుల్లో మరణించాడు.
Go Back to Shorts
Russia
Ukraine
War

More Telugu News