Nirmala Sitharaman: ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెటే.. ఎర్రటి సంచితో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చిన నిర్మలమ్మ!

Nirmal Sitharaman reaches parliament with budget papers
  • పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్
  • డిజిటల్ ఆధారంగా బడ్జెట్ చదవనున్న ఆర్థిక మంత్రి
  • ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ
కాసేపట్లో 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు, ఈ బడ్టెట్ ఎలా ఉండబోతోంది? కేంద్రం నుంచి ఎలాంటి ఊరటలు లభించనున్నాయి? ఎలాంటి ప్రకటనలు వెలువడనున్నాయి? వృద్ధి రేటును పెంచుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వేటి ధరలు పెరగనున్నాయి? వేటి ధరలు తగ్గబోతున్నాయి? ఆయా రాష్ట్రాలకు బడ్డెట్ లో ఎలాంటి మేలు జరగబోతోంది? ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు ఎలాంటి తాయిలాలను ప్రకటించబోతున్నారు? తదితర ఎన్నో ప్రశ్రలు అందరి మదిలో మెదులుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో.. నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, అధికారులతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఆమె ఫోటోలు దిగారు. సంప్రదాయబద్ధంగా జాతీయ చిహ్నం ఉన్న ఎర్రటి సంచిలో ఆమె బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. మరోవైపు ఈ సారి కూడా సభలో ఆమె పేపర్ లెస్ బడ్డెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంటే... పేపర్ ఆధారంగా కాకుండా డిజిటల్ ఆధారంగా ఆమె బడ్జెట్ ను చదవనున్నారు.

మరోవైపు కోవిడ్ నేపథ్యంలో ఈ సారి 'హల్వా' కార్యక్రమాన్ని నిర్వహించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థికమంత్రి, ఆర్థికశాఖ అధికారులు హల్వా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమనేది తెలిసిన విషయమే. ఇక ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం ఇది నాలుగో సారి.
Nirmala Sitharaman
Budget
2022 Budget

More Telugu News