Tirumala: ఎల్లుండి నుంచి తిరుమల వైకుంఠ ద్వారం సర్వదర్శన టికెట్లు.. టోకెన్లు కేవలం తిరుపతి వాసులకు మాత్రమే!

Tirumal Vaikuntam Dwara Darsanam tickets available from Jan 10
  • జనవరి 10 ఉదయం 9 గంటల నుంచి టోకెన్ల జారీ
  • తిరుపతిలో ఐదు టోకెన్ల కౌంటర్లు ఏర్పాటు
  • రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్ల జారీ
ఈ నెల 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కేవలం తిరుపతి వాసులకు మాత్రమే సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్టు చెప్పారు. దీనికోసం తిరుపతిలో 5 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈరోజు ఆయన టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వివరాలను వెల్లడించారు.
 
10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. మున్సిపల్ కార్యాలయం, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాల, ముత్యాలరెడ్డి పల్లె, రామచంద్ర పుష్కరిణి వద్ద టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. టికెట్ పొందిన భక్తులను ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
Tirumala
Vaikunta Darshanam Tockens
TTD

More Telugu News