ECI: ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు

ECI raises election expenditure ceiling for candidates
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన న్యాయశాఖ
  • లోక్‌సభ అభ్యర్థుల వ్యయ పరిమితి పెద్ద రాష్ట్రాల్లో రూ. 95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ. 54 లక్షలు
  • అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి పెద్ద రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 28 లక్షలకు పెంపు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో అభ్యర్థుల వ్యయపరిమితిని గరిష్ఠంగా రూ. 95 లక్షలకు పెంచగా, చిన్న రాష్ట్రాల్లో దీనిని రూ. 54 లక్షలు చేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 28 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచగా, చిన్న రాష్ట్రాల్లో వ్యయ పరిమితిని గరిష్ఠంగా రూ. 28 లక్షలు చేసింది.

ఇక నుంచి జరగబోయే అన్ని ఎన్నికలకు ఈ కొత్త వ్యయపరిమితి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలపై చర్చించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా, ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ECI
Expenditure
Lok Sabha
Assembly

More Telugu News