ఒమిక్రాన్ ఉప్పెనలా వ్యాపించనుంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్

ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి సాధారణంగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో వెల్లువెత్తనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. మున్ముందు ఒమిక్రాన్ అమితవేగంతో వ్యాపించనుందని, చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. అదే జరిగితే, భారత్ మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పోటెత్తుతున్నాయని, నిన్నమొన్నటిదాకా అవుట్ పేషెంట్ చికిత్స సరిపోయిందని, ఇక ఐసీయూలకు తాకిడి పెరుగుతుందని సౌమ్య స్వామినాథన్ వివరించారు. అయితే, ప్రజలు ఒమిక్రాన్ వేరియంట్ ను ఓ సాధారణ జలుబులా తేలిగ్గా తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

ఈ వేరియంట్ గుణగణాలపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, దక్షిణాఫ్రికా నుంచి చాలా డేటా వస్తోందని అన్నారు. డెల్టా కంటే 4 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రభుత్వాలు దీనిపై సన్నద్ధతతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

భారత్ లో ఇప్పటివరకు 1,200 పైచిలుకు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక కేంద్రం ముంబయి నగరాల్లో కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదయ్యాయి.

Soumya Swaminathan
WHO
Chief Scientist
Omicron
India
New Variant
Corona Virus

More Telugu News