టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం

ఏపీలో మైనింగ్ అక్రమాలపై నిజ నిర్ధారణ చేయాల‌ని టీడీపీ బృందం ఏర్పాట్లు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఏపీలోని ప‌లు జిల్లాల్లో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. కర్నూలు పర్యటనకు వెళుతున్న అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఈ రోజు ఉద‌యమే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

దీంతో ఆయ‌న‌ ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. వారిని కూడా పోలీసులు అడ్డుకోవ‌డంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైసీపీ స‌ర్కారుకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. నిజ నిర్ధార‌ణ‌కు వెళ్తుంటే వైసీపీ ఎందుకు భ‌య‌ప‌డుతోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


More Telugu News