ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రూ.3 వేల కోట్లకు పైగా కోల్పోయే ప్రమాదం: జీవీఎల్

GVL says AP Govt will lost funds
  • జల్ జీవన్ పథకం కింద రాష్ట్రానికి నిధులు
  • రాష్ట్రం తన వాటా చెల్లించలేదన్న జీవీఎల్
  • తద్వారా నిధులు మురిగిపోతాయని ఆందోళన
  • ఏపీ సర్కారు చేతగానితనం అంటూ విమర్శ  
జల్ జీవన్ పథకంలో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల పట్ల ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన రూ.3,183 కోట్లను డ్రా చేయడంలో ఏపీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దీనిపై తాను రాజ్యసభలో ప్రశ్నిస్తే కేంద్రం జవాబు ఇచ్చిందని, తద్వారా ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం బట్టబయలైందని వివరించారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీకి రూ.372.64 కోట్లు వచ్చాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జీవీఎల్ వెల్లడించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.790.48 కోట్లు కేటాయిస్తే, రూ.297.62 కోట్లు మాత్రమే డ్రా చేశారని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం అత్యధికంగా రూ.3,180 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.46.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు కేంద్రం తన వాటా విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.453.66 కోట్లను ఇంతవరకు చెల్లించలేదని ఆరోపించారు. 2022 మార్చి లోపు రాష్ట్ర ప్రభుత్వం తాను చెల్లించాల్సిన నిధుల విడుదలలో జాప్యం చేస్తే జల్ జీవన్ పథకం కింద కేంద్రం కేటాయించిన రూ.3,183 కోట్లు నిబంధనల ప్రకారం మురిగిపోతాయని జీవీఎల్ వివరించారు.

ఏపీకి కేంద్రం అన్ని రంగాల్లోనూ వేల కోట్ల నిధులను అనేక పథకాల కోసం అందిస్తున్నప్పటికీ, కేంద్రం చేయూతను అంగీకరించలేని స్థితిలో ఉండడం రాష్ట్ర సర్కారు చేతగానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలపై ఈ నిరాసక్తత ఎందుకు జగన్ గారూ? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు.
Go Back to Shorts
GVL Narasimha Rao
Funds
Jal Jeevan
YSRCP
Andhra Pradesh

More Telugu News