అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మహిళల దుర్మరణం

  • కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
  • రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
  • మరో ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అందులో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం అంతులేని వేగంతో వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

పామిడిలోని 44వ జాతీయ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆటో నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతులది గార్లదిన్నె మండలం కొప్పలగొండగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur District
Pamidi
Road Accident
Auto

More Telugu News