మతం ప్రాతిపదికన తిట్టడం నీచం.. షమీ మీద ట్రోల్స్ పై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ
- ఇలా విమర్శించడం నేనెక్కడా చూడలేదు
- అభిప్రాయం చెప్పే హక్కున్నా ఇలా విమర్శించడం సరికాదు
- షమీ ఏంటో మాకు తెలుసు
- మా సోదర భావాన్ని ఎవరూ తెంచలేరు
మతం పేరుతో దూషించడం మనిషన్నోడు చేసే పని కాదని, అలాంటి వాళ్లను చూస్తే జాలివేస్తోందని అన్నాడు. మతం పేరుతో తిట్టేవారంతా వెన్నులేని వారని పేర్కొన్నాడు. దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఏంటో అందరికీ తెలుసని చెప్పాడు. 200 శాతం షమీకి తమ మద్దతుంటుందని తెలిపాడు. ఎవరికైనా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని, అయితే, మతం ప్రాతిపదికన విమర్శలు చేయడం మాత్రం తానెక్కడ, ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. షమీ అంటే ఏంటో తెలియనివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నాడు. అలాంటి వారి గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోబోనని కోహ్లీ స్పష్టం చేశాడు. ఎవరెన్ని మాటలన్నా తమ సోదర భావాన్ని మాత్రం తెంచలేరని తేల్చి చెప్పాడు.