'దళితబంధు' డబ్బుతో ఎవరికి నచ్చిన, వచ్చిన పని వారు చేసుకోవచ్చు: కేసీఆర్ స్పష్టీకరణ

KCR clarifies Dalit Bandhu
  • తెలంగాణలో దళిత బంధు
  • అసెంబ్లీలో చర్చ
  • వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్
  • ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందని వెల్లడి
దళితబంధు పథకంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. విపక్ష సభ్యులు లేవనెత్తిన సందేహాలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దళితబంధు డబ్బుతో ఎవరికి నచ్చిన, వచ్చిన పని వారు చేసుకోవచ్చని, ఫలానా వ్యాపారమే చేయాలన్న ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. దళితబంధు ఆర్థికసాయాన్ని ఎక్కడైనా, ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని, ప్రభుత్వం దీన్ని మానిటరింగ్ చేస్తుందని  తెలిపారు.

దళితబంధు ఆచరణలో వచ్చే ఇబ్బందులను క్రమేపీ అధిగమిస్తామని పేర్కొన్నారు. ఏడాది కిందటే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉన్నా, కరోనా వల్ల ఆలస్యమైందని వెల్లడించారు. కరోనా వల్ల లక్ష కోట్ల వరకు నష్టం వచ్చిందని వివరించారు. అయినప్పటికీ కోలుకుని దళితబంధు అమలుకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. కొన్ని మండలాల్లో తాను స్వయంగా పర్యటించి దళిత బంధు అమలును పరిశీలిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను సమ దృష్టితో చూసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కొంతమందికి ఈస్ట్ మన్ రంగుల కలలు ఉండొచ్చని, కానీ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తమకు అన్ని రాజకీయ అంచనాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో తమ పనైపోతుందని విపక్షాలు అంటున్నాయని, తమకు హుజూరాబాద్ ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
CM KCR
Dalit Bandhu
TRS
Telangana

More Telugu News