తుపాను ప్రాంతాల్లో ప్రజలకు ఏ సాయం కావాల్సి వచ్చినా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి : చంద్ర‌బాబు

బంగాళాఖాతంలో గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాలు కురుస్తోన్న విష‌యం తెలిసిందే.  దీనిపై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు  నాయుడు స్పందించారు. 'గులాబ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వెంటనే చేపట్టాలి' అని ఆయ‌న చెప్పారు.

'తుపాను పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఏ సాయం కావాల్సి వచ్చినా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. సమస్యలపై ప్రభుత్వానికి వెంటనే సమాచారమిచ్చి అప్రమత్తం చేయండి' అని చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు.  

కాగా, గులాబ్ తుపాన్ ప్రభావంతో  విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంటలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి మహిళ మృతి చెందింది. అలాగే, పెందుర్తి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది.  ఉత్తరాంధ్రతో పాటు పలు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

Chandrababu
Andhra Pradesh
Telangana
Telugudesam

More Telugu News