NV Ramana: ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంది: సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana comments on advocates
  • బార్ కౌన్సిల్ కార్యక్రమంలో సీజేఐ ప్రసంగం
  • న్యాయవాదులకు సూచనలు
  • నైతిక విలువలతో పనిచేయాలని హితవు
  • ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలని సూచన
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని అన్నారు. న్యాయవాదులు నైతిక విలువలతో పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

న్యాయవ్యవస్థపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అనేకమంది న్యాయవాదులు కొవిడ్ తో మరణించారని వెల్లడించారు. కరోనా కారణంగా వర్చువల్ విచారణలు చేపడుతున్నామని వివరించారు. వర్చువల్ విధానంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయని, ఇంటర్నెట్ సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి న్యాయశాఖ చొరవ చూపాలని కోరుతున్నానని ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇంటర్నెట్ సంస్థలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

కోర్టుల్లో ఖాళీల భర్తీకి న్యాయశాఖ మంత్రి చొరవ చూపిన వైనంపై సీజేఐ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు కూడా అదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
NV Ramana
CJI
Bar Council
Supreme Court

More Telugu News