నన్ను లాక్కునేందుకు చంద్రబాబు బేరాలు ఆడించారు.. అయినా నేను లొంగలేదు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు
  • ఒక్క ఎస్సీకి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు
  • అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నవాళ్ల కోసం తపన పడతారని... ముఖ్యమంత్రి జగన్ లేని వారి గురించి ఆలోచిస్తారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డగోలుగా కొనుగోలు చేశారని... వారిలో రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. అయితే ఒక్క ఎస్సీకి కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు. అందుకే ఎస్సీల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు.
 
తనను కూడా టీడీపీలోకి లాక్కునేందుకు చంద్రబాబు యత్నించారని... ఎంతో మందితో బేరాలు ఆడించారని... అయితే తాను లొంగలేదని నారాయణస్వామి చెప్పారు. డబ్బుకు, పదవులకు లొంగే వ్యక్తిని తాను కాదని గతంలో చంద్రబాబుకు తాను నిరూపించానని అన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు, నారా లోకేశ్ ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచినా... చంద్రబాబు ఇంట్లో పాచి పని చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

Narayana swamy
YSRCP
Deputy CM
Jagan
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News