Prakasam District: ఉద్యోగం పేరుతో మహిళను గుంటూరు లాడ్జిలో బంధించి అత్యాచారం.. అనంతరం బ్లాక్ మెయిల్!

Nude videos of a woman being captured in a lodge in the name of a job
  • లాడ్జికి తీసుకొచ్చి అత్యాచారం.. ఆపై వీడియో చిత్రీకరణ
  • వాటిని చూపించి పలుమార్లు అఘాయిత్యం
  • గుంటూరు పోలీసులకు కేసు బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మహిళను నమ్మించిన నిందితుడు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిని వీడియో తీసి బెదిరిస్తూ ఆ తర్వాత కూడా పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. మహిళ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత దానిని గుంటూరుకు బదిలీ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళకు అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్యతో పరిచయం ఏర్పడింది. బాధితురాలు హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుసుకున్న బ్రహ్మయ్య.. అక్కడ తనకు తెలిసినవారు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.

ఉద్యోగం విషయమై మాట్లాడదామంటూ గత నెల 11న ఆమెను గుంటూరు తీసుకొచ్చాడు. విశ్రాంతి పేరుతో రైలుపేటలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లాక తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, ఆ దృశ్యాలను చిత్రీకరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయాన్ని బయటపెట్టినా, తాను పిలిచినప్పుడు రాకున్నా వీడియోలను అందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత కూడా ఆ వీడియోలు చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. ఘటన గుంటూరులో జరగడంతో కొత్తపేట పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కొత్తపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Prakasam District
Guntur District
Rape Case
Andhra Pradesh

More Telugu News