చీరాలలో పిడిగుద్దులు కురిపించుకున్న వైసీపీలోని రెండు వర్గాలు.. ఎమ్మెల్యే సాక్షిగా ఘటన

ప్రకాశం జిల్లా చీరాల మండలంలో వైసీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. మండలంలోని గవినివారిపాలెంలో మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే నిన్న గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో వైసీపీ శ్రేణుల మధ్య ఏర్పడిన వివాదం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకుంది.

దీంతో రెచ్చిపోయిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎమ్మెల్యే, పోలీసులు సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. కాగా, అధికార పార్టీ నేత బుర్ల మురళి ఈ ఘటనపై ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.


More Telugu News